Ad Code

Ticker

6/recent/ticker-posts

కార్తీక పురాణం 6వ అధ్యాయము - దీపదాన విధి మహాత్మ్యం/Karthika Puranam



“ ఓ రాజ శేష్ట్రుడా! ఏ మానవుడు కార్తీక మాసం నెల రోజులూ పరమేశ్వరునికి, శ్రీ మహా విష్ణువుకి , పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజిస్తారో అటువంటి వానికి అశ్వమేథ యాగము చేసిన౦త పుణ్యము దక్కుతుంది.

అలాగే, ఎవరైతే, కార్తీకమాసమంతా దేవాలయంలో దీపారాధన చేస్తారో, వారికి కైవల్యం ప్రాప్తిస్తుంది. ఓ రాజా ! దీపదానం చేసే విధిని శ్రద్ధగా ఆలకించు.  ముందుగా పత్తిని సేకరించి, శుభ్రపరిచి,  స్వయంగా వత్తులు తయారు చేయాలి.  ఆ తర్వాత వరి పిండితో ప్రమిదని చేసి, దానిలో వత్తిని వేసి, ఆవు నెయ్యి వేసి,  వెలిగించి ఆ  ప్రమిదను బ్రాహ్మణునకు దానమివ్వాలి. దాంతోపాటు శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వాలి.

ఈ ప్రకారముగా కార్తీక మాసంలో ప్రతి దినము చేసి, ఆఖరి  రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ  నెల రోజులూ దానము చేసిన బ్రాహ్మణునకే యిది కూడా దానమిచ్చినట్లయితే,  సకలైశ్వర్యములు కలగడమే కాకుండా,  మోక్ష ప్రాప్తి కలుగుతుంది.

సర్వ జ్ఞాన ప్రదం దివ్యం సర్వ సంపత్సుఖవాహం
దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తూ సదామమ||

అని స్తోత్రం చేసి దీపం దానం చేయాలి. ' అన్ని విధములైన  జ్ఞానాన్ని కలుగ జేసేది, సకల సంపదలు అనుగ్రహించేదీ అయిన దీప దానాన్ని చేస్తున్నాను. నాకు శాంతి కలుగుగాక! ' అని అర్థం.

ఈ విదముగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయాలి. శక్తి లేని వారు పది మంది బ్రాహ్మణులకైనా  భోజనం పెట్టి,  దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి.  ఈ విధంగా పురుషులుగాని, స్త్రీలుగాని ఎవరు చేసినా కూడా, సిరి సంపదలు, విద్యాభివృద్ధి ఆయుష్షు వృద్ధి కలిగి సుఖించగలరు” అని చెప్పి , దానికి సంబంధించిన ఇతిహాసాన్ని ఆలకించమని వశిష్టుడు జనకునితో ఇలా చెప్పసాగాడు.

లుబ్ధ వితంతువు స్వర్గమున కేగుట:

పూర్వకాలమున ద్రావిడ దేశంలోని ఒక గ్రామంలో ఒక స్త్రీ ఉండేది.  ఆమెకు పెండ్లి అయిన కొద్ది కాలానికే భర్త చనిపోయాడు. సంతానము గాని, ఆఖరికి బంధువులు గానీ లేరు. అందువల్ల ఆమె యితరుల యిండ్లలో దాసి పని చేస్తూ, అక్కడే  భుజిస్తూ, ఒకవేళ యజమానులు వారి సంతోషం కొద్దీ ఏమైనా వస్తువులిస్తే,  ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరకు అమ్ముకుంటూ, ఆ విధముగా తన వద్ద పోగయిన సొమ్మును వడ్డీలకు యిచ్చి, మరింత డబ్బులు కూడబెట్టు కుంటూ, దొంగలు దొంగిలించి కూడా తీసుకువచ్చిన వస్తువులను  తక్కువ ధరకు కొని, యితరులకు యెక్కువ ధరకు అమ్ముకొంటూ - సొమ్ము కూడబెడుతూ ఉండేది. ఎంత సంపాదించినా ఫలమేమి? ఆమె ఒక్కరోజు కూడా ఉపవాసము గాని, దేవుని మనసార ధ్యాని౦చడం గాని చేసి యెరుగదు.  పైగా వ్రతములు చేసేవారిని, తీర్థయాత్రలకు వెళ్లే వారిని జూచి అవహేళన చేసి, యే ఒక్క భిక్షగానికి  పిడికెడు బియ్యము పెట్టక, తాను తినక , మహా పిసినారిగా జీవిస్తూ ధనము కూడబెట్టడమనే ప్రక్రియని కొనసాగించేది.

ఇలా కొంత కాలం జరిగింది. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగనాయకులను సేవించేందుకు బయలుదేరి, మార్గ మధ్యములో ఈ స్త్రీ ఉన్న గ్రామానికి వచ్చి, ఆ రోజు అక్కడొక సత్రములో మజిలి చేసెను. అతడు గ్రామములోని మంచిచెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకుని ఆమె దగ్గరికి వెళ్లాడు. “అమ్మా! నా హితవచనాలు విను.  నీకు కోపం వచ్చినా సరే, నేను చెప్పే మాటలు ఆలకించు. మన శరీరములు శాశ్వతము కావు. నీటి బుడగలవంటివి. ఏ క్షణములో మృత్యువు మనలను తీసుకుపోతుందో ఎవరూ చెప్పలేరు. పంచ భూతములు, సప్త ధాతువులతో నిర్మించబడిన ఈ శరీరములోని ప్రాణము - జీవము పోగానే చర్మం, మాంసం కుళ్ళి, దుర్వాసన కొట్టి,  అసహ్యముగా  తయారవుతుంది. అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమిస్తున్నావు.  ఇది అజ్ఞానంతో కూడిన దురాలోచన.

తల్లీ! నీవు బాగా ఆలోచించుకో! అగ్నిని చూసి మిడత దానిని తిందామని భ్రమించి, దగ్గరకు వెళ్లి భస్మమయిపోతోంది. అలాగే,  మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి, అంధకారములో పడి నశిస్తున్నాడు. కాబట్టి, నామాటవిని, నీవు తినకుండా, ఇతరులకు పెట్టకుండా, అన్యాయంగా సంపాదించిన సొమ్మును ఇప్పుడైనా పేదలకు దానధర్మాలు చేసి పుణ్యాన్ని సంపాదించుకో. ప్రతి రోజూ శ్రీమన్నారాయణుని స్మరించి, వ్రతాదికములు చేసి మోక్షము పొందు. నీ పాప పరిహరర్ధముగా, వచ్చే కార్తీకమాసమంతా  ప్రాత: కాలమున నదీస్నాన మాచరించి, దాన ధర్మములను చేసి, బ్రాహ్మణులకు బోజనము పెట్టినట్టయితే, వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలవని వుపదేశమిచ్చెను.

అప్పుడా వితంతువు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై, మనస్సు మార్చుకొని, నాటినుండి దానధర్మములు చేయుచు కార్తీకమాస వ్రతమాచరించుటచే జన్మరాహిత్యమై మోక్షము పొందెను. కావున కార్తీకమాసవ్రతములో అంత మహత్మ్యమున్నది.

ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి ఆరవ అధ్యాయము - ఆరవ రోజు పారాయణము సమాప్తము.

సర్వం శ్రీ  మహేశ్వరార్పణమస్తు ! స్వస్తి

Post a Comment

0 Comments